చాట్జీపీటీపై భావోద్వేగ ఆధారత పెరుగుతోంది, ఆత్మహత్య ఆలోచనలు ఆందోళన కలిగిస్తున్నాయి
మన సౌకర్యం కోసం, మన ఆనందం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్న ఈ రోజుల్లో, అదే సాంకేతికం మన వినాశనానికి కారణమవుతోందని తాజా వివరాలు సూచిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ఏఐ సంచలన గణాంకాలను వెల్లడించింది.
తమ చాట్బాట్ చాట్జీపీటీతో ప్రతి వారం పది లక్షల మందికి పైగా యూజర్లు ఆత్మహత్య (Suicide) ఆలోచనలపై చర్చిస్తున్నారని సంస్థ తెలిపింది. ఇది ఏఐపై ప్రజలు మానసికంగా, భావోద్వేగపరంగా ఎంతగా ఆధారపడుతున్నారో చూపిస్తోంది. ప్రస్తుతం చాట్జీపీటీకి వారానికి 800 మిలియన్ల యాక్టివ్ యూజర్లు ఉండగా, వారిలో సుమారు 0.15 శాతం మంది ఆత్మహత్యకు సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
ఇంకా, దాదాపు ఇదే సంఖ్యలో యూజర్లు చాట్జీపీటీతో తీవ్ర భావోద్వేగ అనుబంధం పెంచుకుంటున్నారని, లక్షలాదిమందిలో మానసిక రుగ్మతల లక్షణాలు కనిపిస్తున్నాయని ఓపెన్ఏఐ పేర్కొంది. ఈ పరిస్థితులు గణాంకపరంగా అరుదైనవే అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న సూచనలు ఇవని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సంస్థ తన ప్లాట్ఫారమ్ను మరింత సురక్షితంగా మార్చేందుకు 170మందికి పైగా మానసిక నిపుణులతో కలిసి పనిచేస్తోంది. ముఖ్యంగా ఆత్మహత్య ఆలోచనల వంటి సున్నితమైన అంశాల్లో చాట్బాట్ ఎలా స్పందించాలో మెరుగుపరుస్తున్నట్లు తెలిపింది.
తాజాగా విడుదలైన జీపీటీ-5 మోడల్ ఈ విషయంలో గణనీయమైన అభివృద్ధి సాధించింది. పాత మోడల్తో పోలిస్తే కొత్త మోడల్ 65 శాతం మెరుగ్గా స్పందించిందని, అలాగే ఆత్మహత్య సంభాషణల సమయంలో భద్రతా నియమాలను పాటించడంలో 91 శాతం కచ్చితత్వం సాధించిందని ఓపెన్ఏఐ వెల్లడించింది.
అయితే, ఈ మెరుగుదలల మధ్య సంస్థ తీవ్ర విమర్శలు మరియు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటోంది. ఇటీవల అమెరికాలో 16 ఏళ్ల బాలుడు చాట్జీపీటీతో చర్చించిన తర్వాత ఆత్మహత్య చేసుకోవడంతో, అతని తల్లిదండ్రులు ఓపెన్ఏఐపై దావా వేసినట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
ఈ ఘటన ఏఐపై పెరుగుతున్న భావోద్వేగ ఆధారత, మరియు సాంకేతిక పరిజ్ఞానం మన మానసిక ఆరోగ్యంపై చూపుతున్న ప్రభావంపై మరోసారి చర్చను తెరపైకి తెచ్చింది.